ఓ మంచి పుస్తకం - Peaks and Valleys

Posted by జీడిపప్పు

మనుషులకు ఒడిదుడుకులు సహజం. కష్టాల్లో ఉన్నపుడు నిరాశ చెంది ఈ జీవితమింతే అనుకొని సరి అయిన నిర్ణయం తీసుకోక ఆ తర్వాత మంచి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగపరుచుకోని వారు చాలామందే ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి తన ఫ్రెండ్ సూచించిన ఒకామెను కలిసి "ఏదో కథ విన్న తర్వాత మీ కష్టాలు తీరిపోయాయట కదా. ఇది అందరికీ వర్తిస్తుందా?" అన్నపుడు ఆమె "ఈ కథ నాకు నచ్చింది, కాస్త మార్పు తెచ్చింది.. నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.. అయినా ఒకసారి వింటే నష్టం లేదుగా" అంటు కథ మొదలుపెడుతుంది.

కథకొస్తే-  చుట్టూ కొండలున్న ఓ ఊరిలో కథానాయకుడయిన యువకుడు నివసిస్తూ ఉంటాడు.  పెద్దగా ఆశలు, ఆశయాలు లేని ఇతడు తనపని తాను చేసుకుని పోతుంటాడు, ఎలా అంటే... ఇతను పని చేయడం వల్ల లాభం లేదు, చేయకపోతే నష్టంలేదు. కానీ ఏదో పని చేస్తుంటాడు. కొన్నాళ్ళకు ఆ ఉద్యోగం పోవడంతో నిరాశతో కుంగిపోయి మరో ప్రయత్నం చేయడు. అపుడపుడు ఊరిబయట ఉన్న పచ్చికలో సేదతీరుతూ చుట్టూ కనిపిస్తున్న ఎత్తయిన శిఖరాలను చూస్తూ 'ఈ ఊళ్ళో ఏదీ ఆసక్తిగా లేదు, ఆ శిఖరాల పైన అంతా చాలా బాగుంటుంది. ఎప్పటికయినా అక్కడకు వెళ్ళాలి ' అనుకుంటుంటాడు. ఈ ఆలోచన పెరిగి పెద్దదయి ఆ శిఖరాలకు వెళ్ళాలన్న కోరికను తన ఇంట్లోవారికి చెప్పి వారు వద్దని వారిస్తున్నా వినకుండా బయలుదేరి ఎంతో కష్టపడి ఒక శిఖరాన్ని చేరుకుంటాడు.

శిఖరం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వృద్దుడు ఇతన్ని చూసి ఎందుకిలా వచ్చావు అని వివరాలు తెలుసుకుంటాడు. తన ఉద్యోగం పోయిందనీ, ఏ విషయం పట్ల పెద్దగా ఆసక్తిగా లేదని, ఈ శిఖరాల దగ్గర చాలా ఆహ్లాదకరంగా ఉందనీ, ఇక్కడే తాను ఉండిపోతాననీ చెప్తాడు. అది విన్న వృద్దుడు నవ్వి ఒకప్పటి తనను ఆ యువకుడిలో చూసుకొని "జీవితంలో ఎగుడు దిగుడులు సహజమే, ఉన్నతస్థాయిలో అన్ని సౌకర్యాలతో బతకడం సులభమే కానీ కష్టకాలంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే ఉంటే దాని సత్ఫలితం రాబోవు మంచిరోజులలో ఎలా ఉంటుందో, అన్నీ సవ్యంగా జరుగుతున్నపుడు పొరపాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో " వివరిస్తాడు. రెండు రోజులు వృద్దుడిదగ్గర జీవితం గురించి విలువయిన విషయాలు తెలుసుకున్న యువకుడు ఉత్సాహంతో మళ్ళీ తన సొంత ఊరుకొచ్చి ఉద్యోగంలో చేరి చాలా కష్టపడి పనిచేస్తాడు, మంచి పేరు తెచ్చుకొని ప్రమోషన్ కూడా తెచ్చుకుంటాడు.

ఇంతటితో కథ ముగిసి ఉంటే ఈ పుస్తకం ఇంత పాపులర్ అయ్యేది కాదు, మనము చదవనవసరం లేదు. నాలుగు మంచి మాటలు విని ఉత్తేజపూరితుడయి ఆ ఉత్సాహంలో తాత్కాలిక విజయం సాధించడం చాలమందికి సహజమే. అయితే సగటుమనిషిలా ఈ యువకుడు కూడా కొన్నాళ్ళు చాలా చక్కని జీవితం గడుపుతాడు కానీ మళ్ళీ కథ మొదటికొస్తుందు.  మళ్ళీ కష్టాలు ఎదురయి నిరాశ చెందుతాడు. చాలా గొప్ప విషయాలు తెలుసుకున్న తనకు ఈ సమస్యలెందుకు అనుకుంటూ మథనపడుతుంటాడు. కొన్నాళ్ళకు తిరిగి ఆ వృద్దుడిని కలిసిన తర్వాత ఏమి జరుగుతుంది? దాని పర్యవసానాలేమిటి అన్నదే ఈ పుస్తక విషయం.

ఈ పుస్తకంలో బాగా నచ్చిన రెండు అంశాలు -  1) మనము ఏదయినా సమస్య ఎదుర్కొటున్నపుడు 'అలా నిరాశతో ఉండకు. పాజిటివ్ గా ఆలోచిస్తే మంచే జరుగుతుంది ' అని సలహా ఇస్తుంటారు. చెప్పేవాడికి అది బాగానే ఉంటుంది కానీ అనుభవిస్తున్నవారు "చెప్పడం సులువే కానీ ఆచరించి ఏమి లాభం? పోయినవి మళ్ళీ తిరిగొస్తాయా, ఆ నష్టం ఎలా పూడుతుంది" అంటుంటాము. సరిగ్గా ఇదే మాటను యువకుడు అన్నపుడు ఆ వృద్దుడు "నీ దగ్గరికి ఇద్దరు ఉద్యోగానికి వచ్చారు. ఒకడు చాలా నిరాశతో తన గతం గురించి బాధపడుతూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. మరొకడు జరిగిందేదో జరిగిపోయింది, కష్టపడి పనిచేస్తే మెరుగుపడవచ్చు అన్నాడు. వీరిద్దరిలో ఎవరికి ఉద్యోగం ఇస్తావు? ఎందుచేత" అని యువకుడితో జవాబు చెప్పించే సంభాషణలు.

2) యువకుడు "జీవితంలో ఈ ఎగుడుదిగుళ్ళెందుకు? ఏ కష్టమూ రాకుండా ఎపుడూ అన్నీ సాఫీగా ఉంటే బాగుంటుంది కదా" అన్నపుడు వృద్దుడు గుండె కొట్టుకొనే గ్రాఫును, ఒక సరళ రేఖను చూపెట్టి "ఎగుడుదిగుళ్ళు ఉన్నాయంటే గుండె కొట్టుకుంటున్నదని అర్థం" అని చెప్పడం.

ఈ రచయిత వ్రాసిన Who Moved My Cheese పుస్తకం లాగే ఈ పుస్తకం కూడా 100 పేజీల కంటే చిన్నది. మధ్య మధ్యలో పేజీ మొత్తానికకి ఒక వాక్యం ఉండడము, మిగతా పేజీల్లో కూడా ముప్పావుశాతం మాత్రమే నిండి ఉండడముతో మొత్తం పుస్తకాన్ని గంట-గంటన్నరలో ముగించవచ్చు.

తెలంగాణాలో చదువులు - KTR విశాలహృదయం - ప్రొ.నాగేశ్వర్ కుట్ర

Posted by జీడిపప్పు

తెలంగాణా ఉద్యమం మహారసవత్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఉద్యోగులను, కార్మికులను ఉద్యమంలోకి లాగి వారిని దిక్కుతోచని స్థితికి నెట్టిన రాజకీయనాయకులు అది చాలదన్నట్టు విద్యార్థులపైన కూడా తమ ప్రతాపాన్ని చూపెట్టాలని ప్రయత్నిస్తున్నారు కానీ కొంతమంది తల్లిదండ్రులనుండి గట్టి వ్యతిరేకత ఎదురవుతుండడంతో వీరి ఆటలు అంతగా సాగడం లేదు.

 పిల్లలు నెలలతరబడి స్కూళ్ళకు వెళ్ళకుంటే చదువుకున్నది కాస్తా మరచిపోవడమే కాకుండా చదువుపైన ఆసక్తి తగ్గిపోయి భవిష్యత్తులో డక్కీ ఒకటి పట్టుకొని పాటలు పాడుకుంటారేమో అన్న భయంతో తల్లిదండ్రులు తెలంగాణా నాయకులకు ఎదురు తిరుగుతూ విద్యను ఉద్యమం నుండి మినహాయించాలి అంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యమం పతాకస్థాయికి చేరుకొని విశ్రాంతి దిశవైపు ఆశగా చూస్తోంది. ఈ సమయంలో విద్యను మినహాయిస్తే రైతులు వ్యవసాయాన్ని మినహాయించాలని, ఉద్యోగులు తమ విధులను మినహాయించాలని అడిగితే ఇక సమ్మె చేసేదెవరు? ఏ మహబూబ్ నగర్‌లోనో లేదా నల్గొండలోనో సామాన్యుడు నరకయాతన అనుభవిస్తే కదా ఢిల్లీ మొత్తం కదిలేది. ఇంటర్ చదివే విద్యార్థికి సరి అయిన ర్యాంకు రాక జీవితం మరో మలుపు తిరిగితేనే కదా కేంద్రం ఆలోచించేది.

తెలంగాణా నాయకులను "విద్యను మినహాయించండి" అంటే "నాల్రోజులు స్కూలుకు వెళ్ళకుంటే ఏమి మునిగిపోతుంది? స్కూళ్ళు తెరిచాక ఎక్స్‌ట్రా క్లాసులు చెప్పి వాళ్ళ సిలబస్ ముగించి నిష్ణాతులను చేస్తాము.. అదేమంత కష్టమయిన పని కాదు" అన్నాడు ఒక మహానుభావుడు. ఇంకా "అసలు ఈ చదువులు కావాలని కోరుతున్నవారంతా ఎవరి ప్రోద్భలంతో అలా చేస్తున్నారో అందరికీ తెలుసు.. మా ఉద్యమాన్ని చల్లార్చడానికే సీమాంధ్రులు ఇలా పిల్లలకు చదువు ముఖ్యం అంటున్నారు. పిల్లలకు చదువు ముఖ్యమని అంటున్నది కూకట్‌పల్లి ప్రాంతంలోని సీమాంధ్రులే " అన్నాడు!  వారెవా. జోహార్ మేధావి నీకు!

ఇక ఈ విషయంలో అత్యంత ఆసక్తికరమయిన సంగతేమిటంటే "మీరు ఎందుకు బలవంతంగా స్కూళ్ళను మూయిస్తున్నారు?" అంటే "మేమెక్కడ ఆపాము? తల్లిదండ్రులే స్వచ్చందంగా చదువులొద్దు అంటున్నారు. ఉద్యోగులే జీతాలొద్దు అంటున్నారు. టీచర్లే పాఠాలు చెప్పమంటున్నారు.అంతా వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు" అంటూ తెలంగాణా ప్రజలకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టారు. ఈ విషయంలో మాత్రం తెలంగాణా నాయకుల తెలివికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణాలో ఎవరయినా "అయ్యా మా పిల్లలు ఎంసెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలి, దయచేసి కాలేజీలను తెరిపించండి" అంటే వెంటనే "వీడు సీమాంధ్రుల చెంచా" అని ముద్ర వేసి నాలుగు తంతున్నారు.

అన్నట్టు ఓ తెలంగాణా నాయకుడి కొడుకు "నాన్నా నేను కాలేజీకెళ్ళి చదువుకోకపోతే ఈ సారి మంచి ర్యాంకు రాదు..నాకు కాలేజీకి వెళ్ళాలని ఉంది" అంటే, ప్రతివిషయాన్ని "సీమాంధ్రుల కుట్ర" దృష్టితో చూసే ఆ తండ్రి ఏమి ఆలోచిస్తాడు, ఏ జవాబు చెప్తాడు?

************  ************  ************

నాల్రోజులక్రితం మందక్రిష్ణ మాదిగ "తెలంగాణా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళనూ మూసివేయించిన రాజకీయనాయకులు తమ పిల్లలనేమో జూబ్లీహిల్స్ లో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. నిన్నకూడా కేటీయార్ పిల్లలు చిరాయూ స్కూలుకెళ్ళారు" అన్నాడు. నెలరోజులుగా తెలంగాణా ప్రియ బిడ్డలు స్కూళ్ళకు వెళ్ళకుండా ఇళ్ళలో ఉండిపోతే కేటీయార్ పిల్లలు స్కూలుకెళ్ళడం ఎంతవరకు సమంజసం అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇదే విషయాన్ని కేటీయార్‌ను అడిగారు.

ఈ ప్రశ్నకు బదులుగా కేటీయార్ "నేను తెలంగాణా ఉద్యమాన్ని నడిపించే రాజకీయ నాయకుడినే కానీ అంతకంటే ముందు ఒక బాధ్యతగల తండ్రిని. అభంశుభం తెలియని పిల్లలను స్కూళ్ళకు వెళ్ళకుండా అడ్డుకుంటే ఏమి ఒరుగుతుంది? పైగా బాల్యంలోనే ఇలాంటి విషబీజాలు నాటితే వారి భవిష్యత్తులో చాలాప్రమాదం అని మా నాన్న కేసీయార్‌గారు నాకు ఎన్నోసార్లు చెప్పారు కాబట్టే నాపిల్లలను ప్రతిరోజూ స్కూలుకు పంపుతున్నాను. వాళ్ళు స్కూలుకెళ్ళిన తర్వాత నేను తండ్రి పాత్ర నుండి రాజకీయనాయకుడి పాత్రలోకి ప్రవేశించాక ఒక తెలంగాణా నాయకుడిగా స్కూళ్ళను మూసివేయించడం నా బాధ్యత.

ఇక కొందరు నేను స్వార్థపరుడిని అంటున్నారు. అది ముమ్మాటికీ తప్పు. కేవలం నా పిల్లలే కాకుండా నా సోదరి కవిత పిల్లలు, మా అంకుల్ హరీష్‌రావు గారి పిల్లలను కూడా స్కూలుకెళ్ళి బాగా చదువుకోమని నేనే చెప్పి ఈ రోజుకూడా స్కూలుకు పంపించాను. కేవలం చిన్న పిల్లలే కాదు, ఇంటర్ చదువుతున్న నా బంధుమిత్రుల పిల్లలను గురించి ఎంతో కేర్ తీసుకుంటున్నాను. వాళ్ళు రెండు వారాలు నష్టపోయినా భవిష్యత్తుకు ఎంతో ముప్పు. అందుకే వారిని గుంటూరు, విజయవాడలో ఉన్న సీమాంధ్ర కాలేజీలకు ట్రాన్స్‌ఫర్ చేయించాను. నేనూ ఒకప్పుడు సీమాంధ్రలో చదువుకొన్నవాడినే కాబట్టి అక్కడ చదువులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతాయని తెలిసీ మావాళ్ళను సీమాంధ్రకు చెందినవారి వోల్వోబస్సులో అక్కడికి పంపించాను"  అని చెప్పాలనుకున్నాడేమో కానీ మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో..తెలంగాణా వ్యాప్తంగా స్కూళ్ళు మూతపడ్డ ఈ పరిస్థితుల్లో తన పిల్లలు స్కూలుకెళ్ళడం ఎంతవరకు సమంజసమో చెప్పకుండా దాటవేశాడు.

************  ************  ************

మన ఛానెళ్ళలో జరిగే చర్చా కార్యక్రమాల్లో కాస్త కూల్‌గా మాట్లాడే నాయకులు, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళంటు అడ్డగోలువాదన చేసే నాయకులతో పాటు మంచి రాజకీయ విశ్లేషకులు కూడా ఉంటారు. ఇలాంటి విశ్లేషకుల్లో నాకు బాగా నచ్చినవారు తెలకపల్లి రవి గారు, శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్ గారు. పక్షపాత ఆలోచనలతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే వీరి అభిప్రాయాలను గమనిస్తే మనకు నిజానిజాలు మరింత స్పష్టంగా తెలుస్తుంటాయి.

ఒక మేధావిగా పేరున్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌గారు మొన్న ఒక చర్చలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎప్పటిలాగే తెలంగాణా నాయకుడు "చదువులొద్దు, సమ్మెలే ముద్దు" "పిల్లలు స్కూళ్ళకు వెళ్ళకూడదు" "నెలరోజుల చదువు నాల్రోజుల్లో నేర్చుకొనే సత్తా మా తెలంగాణా బిడ్డలకు ఉంది" అంటుంటే నాగేశ్వర్ గారు "అయ్యా మీరు పిల్లలను అడ్డుకొని సాధించేదేమీ లేదు. పైగా వారి భవిష్యత్తు ఎంతగా దెబ్బతింటుందో 1969 ఉద్యమం చూసిన మీకు తెలుసు. విద్యను మినహాయించండి. నేనేమీ సమ్మెలో ఒత్తిడి తగ్గించమనడంలేదు. చదువులొద్దు అన్నమాట మాని లిక్కర్ వద్దు అనండి. ప్రభుత్వం దిగివస్తుంది. మందు వల్ల వేల కోట్ల ఆదాయం వస్తోంది. మీరు ఒక మూడు నెలలు తెలంగాణాలో మద్యం షాపులు మూసివేయించి ఎవరూ మందు తాగకుండా చూడండి. దెబ్బకు తన యువకిరణాలు మసకబారుతుంటే సీయం ఢిల్లీ పరుగెత్తికెళ్ళి రాష్ట్రాన్ని నడపడానికి డబ్బుల్లేవు అంటూ తెలంగాణా కోసం ఒత్తిడి తెస్తాడు" అన్నాడు.

ఎంత ఘోరమెంతదారుణం! రాష్ట్రానికి మధం నుండి వస్తున్న ఆదాయంలో 75 శాతానికి పైగా అందిస్తున్న తెలంగాణాలో మద్యం మానివేయడమా? పొరపాటున అలా చేస్తే తొందర్లో నిజ్జంగా తెలంగాణా వచ్చినా వచ్చేస్తుంది. ఉద్యమాన్ని వీలయినన్నాళ్ళు సాగదీస్తూ పబ్బం గడపాలనుకొనే నాయకులు, కలెక్షన్ కింగులు, కలెక్షన్ క్వీన్లు ఏమయిపోతారు? "చదువులు వద్దు, ఉద్యోగాలు వద్దు, జీతాలు వద్దు, రోజువారీ ఆదాయం వద్దు" అంటూ సమ్మె చేస్తున్న తెలంగాణా ప్రజలను "మీరు మద్యం మానేస్తే చాలు, ప్రభుత్వం దిగివస్తుంది" అంటూ నాగేశ్వర్ గారు రెచ్చకొట్టడం వెనుక ఏదయినా కుట్ర ఉందా? తెలంగాణా వ్యతిరేక శక్తులున్నాయా?  

తెలంగాణావాదులు, తాగుబోతులు మరియు తె"మిలిటెంట్లు

Posted by జీడిపప్పు


ప్రత్యేక తెలంగాణా కోసం సాగుతున్న సకలజనుల సమ్మె పాతికరోజులు దాటినా ఇంకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణావాసుల్లో అంతర్మథనం మొదలయినట్టుంది. ఉద్యోగులను సమ్మెలోకి లాగి పూర్తి నెల జీతాలు లేకుండా చేసారు రాజకీయనాయకులు. మరో వైపు కరెంటు కోతవల్ల పంటలు పూర్తిగా ఎండిపోయి రైతన్నల నోట్లో మట్టి కొట్టే స్థితి ఏర్పడింది.  తెలంగాణా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం బాగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క కరెంటు కోత మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో సీమాంధ్రుల కంటే తెలంగాణా సామాన్య ప్రజలు, ముఖ్యంగా రెక్కాడితే కాని డొక్కాడనివారు నానా కష్టాలు పడుతున్నారు.

ఇవన్నీ చూస్తుంటే సాటి తెలుగువాడిగా "పాపం అమాయకులయిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారే" అన్న బాధ వేస్తుంది కానీ, "తెలంగాణా రజకుల సమ్మె, గుడి మూసి క్రికెట్ ఆడుకుంటున్న పూజారులు, అధికారుల వాహనాలను నడపడానికి డ్రైవర్ల నిరాకరణ, 48 గంటల ఆటోల బంద్, సెలూన్ షాపుల బంద్, మొరాయించిన పేపర్ బాయ్స్" లాంటి వార్తలు చూసి "ఓహో, తెలంగాణా సామాన్య జనం ఇలా ఆలోచిస్తున్నారన్నమాట, అయితే వీరికి కేసీయారే సరి అయిన రింగు మాష్టరు" అనిపిస్తుంది.  ఇక్కడ ఒక వింతేమిటంటే "తెలంగాణా కోసం ప్రాణాలు అర్పిస్తాము" అంటూ సమ్మెలో పాల్గొన్న వారు నెలాఖరు వచ్చేసరికి "మా జీతాలు మాకివ్వండి, మా బోనసులెక్కడ" అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలంగాణాకోసం ఒక నెల జీతాన్ని వదులుకోలేరా వీళ్ళు?  'మాకు విద్యుత్ కోత విధించకండి ' అని కూడా అంటున్నారు. ఇదెక్కడి చోద్యం? తెలంగాణా ప్రాంతీయులే విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిరాకరించారు కాబట్టి తెలంగాణాలో పూర్థిస్థాయి కరెంటు కోత విధించి (హైదరాబాదు తక్క) బయటినుండి తెసుకువచ్చే విద్యుత్‌ను సీమాంధ్ర ప్రాంతానికే ఇవ్వాలి అని నా అభిప్రాయం. అఫ్‌కోర్స్, తెలంగాణాకోసం ప్రాణాలయినా అర్పించే వారికి కరెంటు కోత, పంట నష్టం, విద్యాసంవత్సరం నష్టపోవడం లెక్కలోకి రాదనుకుంటా.

 *****************

సీమాంధ్రులతో పోలిస్తే తెలంగాణా ప్రాంత వాసులు కష్టపడి పని చేయరు, తిని తాగి తొంగుంటారు అంటుంటారు గిట్టనివాళ్ళు. ఇది ఎంతవరకు నిజమో ఆ ప్రాంతాల గురించి అవగాహన ఉన్నవారికి బాగా తెలుసు. ఇక మొన్న దసరా పండగ సమయంలో తెలంగాణాలో మద్యం షాపులు బంద్ అన్నారు. 'తెలంగాణాకోసం ఐదారు లక్షలమంది ప్రాణాలర్పించారు కదా, ఈ సమయంలో ఈ మద్యం బంద్ గురించి ఎవరు పట్టించుకుంటారు ' అనుకున్నాను కానీ కొందరు మందు ప్రియులు టీవీల్లో "మద్యం లేకుండా పండగ చేసుకోవడం ఎలా" అని కన్నీళ్ళు పెట్టుకుంటే "సిసలయిన తెలంగాణావాది ఈ ఉద్యమ సమయంలో మద్యం ముట్టకూడదు అని తెలంగాణా మిలిటెంట్ నాయకుడు కోదండరాం హుకుం జారీ చేసాడు కదా, మరి వీళ్ళు ఇలా మందుకోసం ఏడుస్తున్నారంటే తెలంగాణావాదులే కాదు. ఈ ఉద్యమ సమయంలో మిలిటెంట్ నాయకుడి ఆదేశాలమేరకు తెలంగాణాలో ఎవరూ ఒక్కరూపాయికి కూడా మద్యం కొనరు" అని మళ్ళీ అనుకున్నా.

మూడ్రోజుల తర్వాత వచ్చిన గణాంకాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాయి. రాష్ట్రం మొత్తం సుమారు 125 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే అందులో తెలంగాణా ప్రాంతం లో సుమారు 110 కోట్ల అమ్మకాలు జరిగాయట. విజయవాడనుండి పదుల లారీల్లో స్టాకు తెప్పించి డబల్ రేటుకు మందుబాబులకు అమ్మారు. కోదండరాం పుణ్యమా అని సీమాంధ్ర మద్యం వ్యాపారులు కోట్లు సంపాదించారు. కేవలం ఈ వార్త ఆధారంగా తెలంగాణావాసులు మద్యం ప్రియులు అని అభాండం వేయడం సరికాదు అని నా అభిప్రాయం. ప్రత్యేక తెలంగాణా ఏర్పడకపోవడం చూసి ఆ బాధ మర్చిపోవడానికే తెలంగాణావాదులు మద్యం బాట పట్టారా, లేక తెలంగాణావాసులు ఈ స్థాయిలో మద్యానికి అలవాటుపడడం వెనుక కావూరి, లగడపాటిల కుట్ర ఏమయినా ఉందా అని కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

*****************

గత కొద్ది రోజులుగా తెలబాన్ల దుర్మార్గాలు మిన్నంటుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతమునుండి వస్తున్న బస్సులను సరిహద్దుల్లో ఆపివేయడం, వెళ్తున్నబస్సుల పైన రాళ్ళు రువ్వి అందులో స్త్రీలు, వృద్దులు, చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్న  ఒక తెలంగాణా తీవ్రవాది చేష్టలను చూసిన వీడి తల్లి, వీడి తండ్రులు ఎంత గర్వపడతారో అనిపిస్తుంది.  ఎంతయినా కోదండరాం నేతృత్వంలో ఉద్యమం చేస్తున్నారు కదా.. ఆ మాత్రం ఉన్మాద చర్యలు లేకుంటే ఎలా? గాంధీ వారసులయిన తెలంగాణావాదులు అహింసాయుతంగా చేస్తున్న పోరాటంలో కోదండరాం వంటి రాక్షసాంశ కలిగినవాడు ప్రవేశించడం చాలా బాధాకరం. ఆ మధ్యనే వీడు 'తెలంగాణాలో మిలిటెంట్లను తయారు చేస్తా" అన్నాడు. వీడు చెప్పినట్లే చేస్తూ ఉన్మాదులు తయారవుతున్నారు.

ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన వీడి మాటలకు ఎదురు చెప్పకుండా మిగతా పార్టీల నాయకులు గంగిరెద్దుల్లా తలలూపడం చూస్తుంటే వీళ్ళకు కనీస ఇంగితం, సిగ్గూ ఉందా అన్న అనుమానం కలుగుతుది. వీడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏకపక్షమే, అందరూ శిరసావహించవలసిందే. లేదంటే తెలంగాణా తీవ్రవాదులను, మిలిటెంట్లను ఉసిగొల్పుతాడు! ఇన్నాళ్ళు వీడి చేష్టలు చూసినపుడు కోపం వచ్చినా మొన్న టీవీలో " రైల్ రోకోను 9,10,11 తేదీల్లో కాకుండా 12,13,14 తేదీలకు వాయిదా వేస్తున్నాము. ప్రయాణీకులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోండి" అంటూ లార్డ్ లా వీడు చెప్తుంతుంటే అర్జంటుగా వీడికి దండెయ్యాలనిపించింది. ఎవరినడిగి వీడు ఈ రైల్‌రోకో నిర్ణయించాడు? ఎవరితో చర్చించి వాయిదా వేస్తున్నాడు? రైళ్ళను నడపాలావద్దా అన్నది వీడి అంకుల్స్ చేతిలో ఉందా?

 (తెలంగాణావాదులను "తీవ్రవాది" అని, కోదండరాంను "వాడు, వీడు" అనడం గమనించి ఉంటారు. వీడు ఒక ప్రొఫెసరు కాబట్టి మునుపెన్నడూ ఇలా బహిరంగంగా "వీడు" అనలేదు.  నిజానికి వీడు చేస్తున్న పనులకు అలా అనడంలో తప్పేమి లేదు. ఆ మధ్యన Ntv లో కొమ్మినేని శ్రీనివాసరావు రోజువారీ జనాలను రెచ్చగొట్టే పిచ్చాపాటి తెలంగాణా చర్చలో ఎమ్మెల్యే అల్లం రాజయ్య (??) ను "అదేంటండి, నిన్న కేసీఆర్ ఎంపీ అయిన కావూరి సాంబశివరావు ను పట్టుకొని 'వీడొక దళారి. వాడి అంతు తేలుస్తాము, నాలుకలు చీరేస్తాం అన్నాడు" అంటే సదరు తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యే గారు "వాడు, వీడు అనడం తెలంగాణా సంస్కృతిలో భాగం. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. నాలుక చీరేస్తాం అంటే 'దయచేసి మా బాధ అర్థం చేసుకోండ'ని భావం. మీరు ప్రతిదానికీ పెడర్థాలు తీయకూడదు." అన్నాడు. కాబట్టి తెలంగాణా సంస్కృతిని గౌరవినడానికే కోదండరాంను "వీడు" అనవలసివచ్చింది. అలాగే "తెలంగాణా తీవ్రవాది" అంటే 'తెలంగాణా కావాలని తీవ్రంగా వాదించేవాడు" అని అర్థం. ఇక్కడ భాష ముఖ్యం కాదు, భావమే ప్రధానం కదా!)

ఇప్పటివరకు ఉద్యోగులను ఉద్యమంలోకి లాగి వారికి ఒక దారి చూపించకుండా అయోమయానికి గురిచేసిన కోదండరాం కన్ను ఉన్నట్టుండి ఎందుకో హైదరాబాదులోని విద్యాసంస్థల పైన పడింది. మొన్నపనిగట్టుకొని మరీ "హైదరాబాదులోని అన్ని విద్యా సంస్థలూ మూసివేసి సమ్మెలో పాల్గొనాలి" అని చెప్పుకొచ్చాడు. 1969లో తెలంగాణా ఉద్యమం వల్ల విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారట. అప్పుడు ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ ప్రోత్సహించి ఊరికే మార్కులు వేసారట. అలా మొదలయిన పతనం పది పదిహేనేళ్ళు కొనసాగి మళ్ళీ గాడిలోకి వచ్చింది. ఈలోపు చాలామంది పక్కదారులు పట్టారని తెలంగాణా విద్యావేత్త అయిన కంచె ఐలయ్య "చదువుకు సమ్మె వద్దు" అన్నవ్యాసంలో వ్రాశాడు. ఇది తెలిసి కూడా కోదండరాం "చదువులొద్దు" అనడం వెనుక మతలబేమిటో? హైదరాబాదులోని విద్యాసంస్థలు తాను అడిగిన కమీషన్ ఇవ్వలేదని అక్కసా లేక విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి తన ఉన్మాద చర్యల్లో పావులుగా వాడుకోవడానికి వేస్తున్న ఎత్తుగడా?


అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 3

Posted by జీడిపప్పు

ఈ-రీడర్లు/ట్యాబ్లెట్ కంప్యూటర్ల మధ్య కొనసాగుతున్న యుద్దానికి గతవారం అమెజాన్ సీయీవో మరో అంకాన్ని చేర్చాడు. iPad ను ఢీకొట్టడం మరెవరివల్లా కాకపోవడంతో మరి కొన్నేళ్ళు iPad ఆధిపత్యానికి తిరుగులేదనుకున్న వారు పునరాలోచించుకొనేలా ఓ మినీ iPad ను Kindle Fire పేరుతో విడుదల చేసాడు. ప్రస్తుత iPad ను $500కు (??) రిలీజ్ చేసినపుడే స్టీవ్ జాబ్స్ మరో మినీ iPad ను కాస్తంత తక్కువ ధరకు మార్కెట్లోకి వదిలి ఉంటే అమ్మకాలు మరింత పెరిగేవేమో కానీ, ఎందుకో ఆపిల్ అలా చెయ్యలేదు.!

ఇప్పటిదాకా కేవలం పుస్తకాలను చదువుకొనే ఈ-రీడర్ల పైన మాత్రమే దృష్టి పెట్టిన అమెజాన్ ఇప్పుడు కేవలం $199 కే 7 inches కలర్‌స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్ ను విడుదల చేసింది.  ఇది గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పైన నడుస్తుంది కాబట్టి మార్కెట్లో ఉన్న వేలాది applications ఇందులో కూడా వాడవచ్చు.  ఇక iPad తరహా ఇందులో సినిమాలు, మ్యూజిక్, బుక్స్.. మొదలయిన అన్ని సదుపాయాలున్నాయి. కెమెరా, వాయిస్ ఛాట్ లేకపోవడం ఒక మైనస్ కావచ్చు.  Fire స్క్రీన్ సైజు కేవలం 7" కావడం వల్ల పీడీయఫ్‌లు చదువుకోవడమే కష్టమేనేమో. ఏది ఏమయినా ఇది అమెజాన్ ప్రాడక్టు కాబట్టి తప్పక మన డబ్బుకు తగిన ప్రతిఫలాన్నిస్తుంది అన్న నమ్మకం ఉంది. పూర్తివివరాలను నవంబరులో Fire విడులయ్యాక చూడాలి.

Fire తో పాటు మరో రెండు ఇ-రీడర్లను కూడా అమెజాన్ సీయీవో Jeff Bezos విడుదల చేసాడు.  ఇప్పటికే Kindle 3 ధరను $189 నుండి $139 కు, ఆ తర్వాత ads ఉన్నదాన్ని $114కే ప్రకటించి కొన్నవారికి బాధను, కొనేవారికి ఆశను కల్గించిన Bezos ఈసారి Kindle 3 కొన్నవారు "తొందరపడ్డామేమో!" అనుకొనేలా చేసాడు. (ఆఫ్‌కోర్స్.. ఎలక్ట్రానిక్స్, కార్లు లాంటివి కొన్న ప్రతివారికీ ఇలాంటి బాధలు మామూలే!). 3G లేని కిండిల్ 3 ధర $114 నుండి $99 కి వచ్చింది. దీనితోపాటు అదే స్క్రీన్ సైజు ఉన్న Kindle Touch $99కి, కీబోర్డ్ లేని కిండిల్ $79కే లభ్యమవుతోంది!!

ఇవన్నీ చూసిన తర్వాత ఈ-రీడర్ల పైన ఆసక్తి ఉన్నవారు ఏది కొనాలి అంటే చెప్పడం కష్టమే. ఇంట్లో హైస్కూలు పిల్లలుంటే వారికి చివరన చెప్పిన $79 కిండిల్ కొనివ్వడం ఉత్తమం.  iPad కొనాలని, ఇంకా కొనని వారు కొన్నాళ్ళాగి Fire ను $200 కు కొనుక్కోవడం మేలనిపిస్తుంది, అది కూడా Fire రివ్యూలను చదివి. ("ఎంతో కష్టపడి గొప్ప ప్రాడక్టు తయారు చేస్తే మీరు ముష్టి $200 పెట్టి కొనడానానికి రివ్యూలు చూస్తారా? రివ్యూలు చూసి కాదురా ప్రాడక్టు కొనవలసింది" అని ఎవరన్నా అంటే  అది వారి మనస్సాక్షికే వదిలేస్తున్నా)